వాకాడులో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
** తిరుపతి “స్విమ్స్” ఆధ్వర్యంలో వైద్యసేవ
సాక్షిత ప్రతినిధి – వాకాడు / తిరుపతి: టీటీడీకి చెందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) ఆధ్వర్యంలో వరదయ్యపాళెం మండలంలోని చిన్నపాండూరు పిహెచ్ సి, వాకాడు మండలంలోని నిడిగుర్తి పిహెచ్ సిలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి. బిపి, షుగరు పరీక్షలతోపాటు పింక్ బస్సులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. మహిళలు, పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు.
పింక్ బస్సు క్యాంపులు జరిగే పిహెచ్సీలు
- 11న వళ్లిపేడు, చింతవరం.
- 14న వరగళి, బాలిరెడ్డిపాళెం.
- 18న జికె.పల్లి, చెన్నూరు.
- 21న బాలాయపల్లి, డక్కిలి.
- 25న చిట్టేడు, చిల్లకూరు.
- 28న దాసుకుప్పం, బంగారుపేట.
స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటి మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కె.నాగరాజ్, నోడల్ ఆఫీసర్లు డాక్టర్ టివిడి.ప్రత్యూష, డాక్టర్ ఎం.లలిత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో టీటీడీ పీఆర్వో విభాగం సిబ్బంది చంద్రమోహన్, చిన్న పాండూరు వైద్యాధికారులు డాక్టర్ పవన్, డాక్టర్ ప్రశాంత్, నిడిగుర్తి వైద్యాధికారులు డాక్టర్ హేమ, డాక్టర్ స్రవంతి, స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత, డాక్టర్ చైతన్య భాను, సర్పంచ్ నాగరాజు, స్థానిక నాయకులు అజిత్, సంపత్, ఎంపిహెచ్ఈవో రవీంద్ర, సూపర్వైజర్లు పవనకుమారి, సలోమి, ఏఎన్ఎం , ఆశాలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
