మంథనిలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….
–కార్యకర్తల్లో ఉత్సాహం….
సాక్షిత పెద్దపల్లి// మంథని:
మంథనిలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏగోళం శంకర్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, మంథని నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలపరచాలని, 2028 ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధుకర్ను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని, ఐక్యతతో ముందుకు సాగితే పార్టీ మరింత శక్తివంతమవుతుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల, టౌన్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY