ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
** వైభవంగా ధ్వజారోహణ ఘట్టం
సాక్షిత ప్రతినిధి – ఒంటిమిట్ట / తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. కంకణబట్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ముందుగా గరుడ ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గరుడ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ట, నేత్రోల్మీలనం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేసినట్టు చెశారు. రాగతాళ నివేదన ద్వారా ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ధ్వజారోహణం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు ఎ. ప్రశాంతి, ఎ. శివప్రసాద్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

