ఘనంగా భగవద్గీత జయంతి ఉత్సవాలు

Sakshitha news

ఘనంగా భగవద్గీత జయంతి ఉత్సవాలు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో దేవాలయాలు, ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ఉదయం భగవద్గీత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గీతా మందిరం నిర్వాహకులు మొరిశెట్టి రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో శ్రీకృష్ణ భగవానునికి విశేష పూజలు చేశారు. అనంతరం వందలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలను సామూహికంగా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక కోకన్వీనర్ నాగవెళ్ళి ప్రభాకర్ మాట్లాడుతూ, “భగవద్గీత మత గ్రంథం మాత్రమే కాదు, సర్వ మానవాళిని ఉద్ధరించే అపూర్వ వ్యక్తిత్వ వికాస గ్రంథం” అని పేర్కొన్నారు.

గీతాజయంతి సందర్బంగా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పట్టణంలోని అన్ని దేవాలయాల్లో వందలాది మంది భక్తులతో పారాయణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 7న ఆదివారం స్థానిక రవి మహల్‌లో వెయ్యిమంది భక్తులతో జరగనున్న సామూహిక భగవద్గీత పారాయణం ‘సహస్రగళ గీతార్చన’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పర్వతం శ్రీధర్ కుమార్, కందగట్ల రామకృష్ణ, కమటాల వెంకటేశ్వర్లు, నామిరెడ్డి సత్తిరెడ్డి, భూపతి వెంకన్న, కుక్కడపు కృష్ణమూర్తి, కక్కిరేని కేదారీశ్వరి, వనపర్తి సువర్ణలక్ష్మి, భోనగిరి పుణ్యావతి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top