శంకర్పల్లి కూరగాయల మార్కెట్లో దుర్వాసన – సులబ్ కాంప్లెక్స్ నీళ్లు పొంగిపొర్లుతున్నా పట్టించుకోని అధికారులు
సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా పెరిగాయి. మార్కెట్ ప్రాంగణంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ నుంచి మురుగు నీళ్లు తరచూ పొంగిపొర్లుతుండడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానికుల సమాచారం ప్రకారం, గత రెండు సంవత్సరాలుగా ఇదే సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మార్కెట్లో ఏర్పాటు చేసిన రెండు సులబ్ కాంప్లెక్స్లలో ఒకటి పూర్తిగా పనికిరాకుండా ఉండగా, మరోటి నుంచి వచ్చే మురుగు నీళ్లు డ్రైనేజీ ద్వారా బయటకు రావడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోంది.
ఎయిర్ ఫ్లో సరిగా లేకపోవడం వల్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దుర్వాసన కారణంగా వ్యాపారులు ముక్కు మూసుకుని వ్యాపారం చేయాల్సి వస్తుండగా, కూరగాయలు కొనడానికి వచ్చే ప్రజలు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు.
గత ఆదివారం మురుగు నీళ్లు మార్కెట్లోకి చేరడంతో రైతులు తమ పంటలను అదే నీళ్లలో ఉంచి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని వ్యాపారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
