నందిగామ హనుమంతుపాలెంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలన.

Sakshitha news

నందిగామ హనుమంతుపాలెంలో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి స్థల పరిశీలన.

నందిగామ: నందిగామ పట్టణంలోని హనుమంతుపాలెం గ్రామంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. టిడ్కో ఇళ్ల స్థలాల ప్రాంతాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించిన ఆమె, భవిష్యత్ ఆరోగ్య సేవల అభివృద్ధికి ఇది కీలకమైన అడుగుగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జి ప్లస్ త్రీ మోడల్ ఇళ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, గత వైసీపీ పాలనలో ఈ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యం పాలై నిర్మానుష్యంగా మారిందని విమర్శించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు ఈ పరిశీలన చేపట్టినట్లు ఆమె తెలిపారు.

అధికారులతో కలిసి స్థల పరిస్థితులను సమీక్షించిన ఎమ్మెల్యే , త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి మండవ కృష్ణకుమారి,స్థానిక ప్రజాప్రతినిధులు,ఆర్డిఓ,మున్సిపల్ కమిషనర్,అధికారులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.