బహిరంగ మల మూత్ర విసర్జన అరికడదాం.
ఇంచార్జి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య.
నగరంలో బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా పలుచోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని ఇందుకు ప్రజలు సహకరించాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య పిలుపునిచ్చారు. వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కావడం వలన ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మొత్తం 52 టాయిలెట్లను 40 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు.
వాటి నిర్వహణ బాధ్యతలను సులభ ఇంటర్నేషనల్ సంస్థ, మరికొన్ని స్వచ్చంద సంస్థల ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో మరుగుదొడ్లు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలో ఎక్కడా కూడా బహిరంగ మల మూత్ర విసర్జన జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు, భక్తుల సౌకర్యార్థం మరిన్ని మరుగుదొడ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, రెవెన్యూ ఆఫీసర్ రవి, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, డి.ఈ.రాజు, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
