నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే..

Sakshitha news

నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే..

** రాయలచెరువు గ్రామాలు అప్రమత్తం కావాలి

** వరద ప్రాంతాల పర్యటనలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి
…..

సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: నియోజకవర్గం లోని ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అని… వారికి ఏ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. వాయుగుండం కారణంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావం ఉన్న వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఇందులో భాగంగా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్టను మండలస్థాయి అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ బంగాళా ఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దాంతో వాగులు, వంకలు, చెరువులు నిండుతున్నట్లు పేర్కొన్నారు. రాయల చెరువుకట్ట మ్యాప్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.
రాయల చెరువు కట్టను అనుకుని ఉన్న గ్రామాలను ముంపునకు గురి కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు చేశారు. ఇప్పటివరకు రాయల చెరువు 30శాతం మాత్రమే నీరు చెరువుకు చేరిందని అధికారులు ఎమ్మెల్యేకి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలకు అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
రాయల చెరువు కట్టపైన, కట్టకింద గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే భారీ వర్షాలకు పంట నష్ట పోయిన రైతులను గుర్తించి….నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
చిట్టతూర్ కాళేపల్లి గ్రామంలో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్ట పోయామని రైతులు ఎమ్మెల్యే ముందు వాపోయారు. రైతులకు పశుగ్రాసం కోసం పశు సంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడి పశుగ్రాసం అందిస్తా అని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే నాని భరోసా ఇచ్చారు.
రామచంద్రాపురం మండలంలో చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు.
ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నేత గాలి చినబాబు, మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.