తూర్పుగోదావరి జిల్లా : కడియం మండలం : పొట్టిలంక :
▪️మురుగన్ నర్సరీ▪️
నర్సరీలో ఆకట్టుకుంటున్న “వృక్ష గణపతి”
రెండు సంవత్సరాలు కష్టపడి తీర్చిదిద్దిన యువ రైతు
OG కి గిఫ్ట్ గా ఇస్తానన్న దూలం
విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలలో కీలకంగా ఉండే గణనాథుని వినూత్న ప్రతిమల కోసం ఎవరికి వారు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కడియం మండలం పొట్టిలంక మురుగన్ నర్సరీ రైతు అత్యంత అరుదైన జీవం గల వృక్ష గణపతిని రూపొందించారు. కేవలం మొక్కలతో బొమ్మల ఆకారాలను తీర్చిదిద్దడానికి నర్సరీని ఏర్పాటు చేసిన రైతు దూలం ధనరాజు రెండేళ్లు శ్రమించి ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వృక్ష గణపతిని తీర్చిదిద్దారు.తొమ్మిది అడుగులు ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉండే ఈ వృక్ష గణపతి ప్రతిమ అందర్నీ ఆకట్టుకుంటుంది.
ముందుగా ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని తయారుచేసి నాలుగు మాల్పీజియా తీగ జాతి మొక్కలను వాటికి అమర్చారు.అవి ఈ ఆకృతిని అల్లుకునే విధంగా ఎప్పటికప్పుడు ఈ రైతు తగు జాగ్రత్తలు తీసుకునేవారు. మొత్తానికి ఆయన పడ్డ శ్రమ ఫలించింది. అద్భుతమైన గణనాధుని మొక్కల ప్రతిమ రూపుదిద్దుకొంది. కేవలం పదో తరగతి చదివి బొమ్మల తయారీపై ఉన్న ఆసక్తితో నర్సరీ రంగంలోకి వచ్చి తక్కువ సమయంలోనే ఈ రైతు విశేష గుర్తింపు పొందారు. ఈ యువ రైతు వినూత్నంగా రూపొందించిన చెస్ హర్ష్, గిటార్, గార్డెన్ లైట్, వివిధ రకాల ఫ్లవర్స్ ఆకారాలు గల మొక్కల బొమ్మలకు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది.
అయితే ఈ వృక్ష గణనాధుని ప్రతిమ అమ్మకానికి తయారు చేయలేదని ఆయన తెలిపారు. కాని సనాతన ధర్మరక్షణకు ఎంతో పాటుపడుతున్న తన అభిమాన నేత డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఆయన పార్టీ ఆఫీసు లేదా ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి ఇస్తానని ధనరాజు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST