ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్ధులు, యువత : ర్యాలీని ప్రారంభించిన సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్

Sakshitha news

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్ధులు, యువత : ర్యాలీని ప్రారంభించిన సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో విద్యార్ధులు, నిరుద్యోగులకు కలిగిన ప్రయోజనం శూన్యమని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాల పై బీ. ఆర్. ఎస్. విద్యార్ధి విభాగం సికింద్రాబాద్ నియోజకవర్గ శాఖ ఆద్వర్యంలో శనివారం తార్నాకలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకత్వం చేసిన హామీల్లో ఏ ప్రధాన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ వ్యవహార శైలితో విసుగు చెందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఫీజ్ రీయింబర్స్మేంట్ ను పట్టించుకోలేదని, దాంతో విద్యార్ధులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీ. ఆర్. ఎస్. వీ. సికింద్రాబాద్ నియోజకవర్గ నేతలు సత్తి రెడ్డి, నవీన్ నాయిడు, రహీమ్ పాషా, శివానంద, దీపక్, యాదా క్రాంతి, అభి, సాయి తేజ గౌడ్, ప్రసాద్, పృధ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విద్యార్ధులు, యువత తో పాటు బీ. ఆర్. ఎస్. నేతలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లా కార్డులు ప్రదర్శించారు.