వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

Sakshitha news

వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…

గోదావరిఖని అభివృద్ధిలో వర్తక, వాణిజ్య వర్గాల భాగస్వామ్యం కీలకం…

– ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ పట్టణ అభివృద్ధిలో వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాల పాత్ర ఎంతో కీలకమని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని పట్టణ వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొని వ్యాపారవేత్తలు, వర్తకులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించేలా గోదావరిఖనిలో అనుకూల వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నామని రాజ్ ఠాకూర్ తెలిపారు. మౌలిక వసతులు, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, పట్టణ సుందరీకరణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గోదావరిఖని పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు, వ్యాపారులకు మెరుగైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేతో పంచుకుని, గోదావరిఖని అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అందరి సహకారంతో గోదావరిఖనిని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.