పోలీస్ సిబ్బంది సంక్షేమమే లక్ష్యం… సమస్యల పరిష్కారానికి పోలీస్ దర్బార్ …
క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తే శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది…
— సీపీ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రతి శనివారం కమిషనరేట్లో పోలీస్ సిబ్బందిని కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.
కమిషనరేట్ హెడ్క్వార్టర్స్లో ఏఆర్ సిబ్బంది, అధికారుల కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొని ఏఆర్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి వృత్తిపరమైన అనుభవాలు, సమస్యలు, వినతులను ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్యను దర్బార్లో చెప్పేందుకు ఇబ్బందిగా అనిపిస్తే కార్యాలయానికి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మనమందరం ఒక కుటుంబమని, సమన్వయంతో, క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించడం ద్వారా రామగుండం కమిషనరేట్కు, తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
సిబ్బంది మంచి ప్రవర్తనతో విధులు నిర్వర్తించినప్పుడు అధికారులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని, శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ శాఖ, యూనిఫామ్పై గౌరవం ఉంటే చట్టవ్యతిరేక పనుల వైపు ఆలోచనలు రావని పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, పిల్లలతో సమయం గడపాలని తెలిపారు.
ప్రతి శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో పనిచేసే సిబ్బందిని కలుస్తామని, ఏవైనా సమస్యలు లేదా వినతులు ఉంటే కార్యాలయానికి వచ్చి నేరుగా కలవవచ్చని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, శేఖర్, సంపత్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
