అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు పెట్టే భోజనం కలుషితానికి తావు లేకుండా చూడాలి
పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత పై అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి :
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు, గర్భిణులు భోజనం చేస్తారని అందువల్ల అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వారి భోజనం విషయంలో పరిశుభ్రతలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐ.డి. ఒ సి సమావేశ మందిరంలో ప్రపంచ ఆహార భద్రత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వడిజర్లు, సి.డి.పి. ఒ లు పాల్గొనగా నవీన్ ఆహార భద్రత, పరిశుభ్రత పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రతలు పాటించాలని, వంట చేసే ఆయాలు పరిశుభ్రంగా ఉండడం, చేతులు బాగా కడుక్కుని వంట సామానులు, ఆహార పదార్థాలు ముట్టుకోవడం వంటివి చేయాలని సూచించారు.
కూరగాయలు బాగా కడిగిన అనంతరం వాటిని వాడటం, పాత్రలు సబ్బుతో కడిగి వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవడం, స్టోర్ రూమ్ కు మంచి గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సరిగ్గా ఉడకని చికెన్ ఒక గర్భిణి తింటే గర్భిణితో పాటు కడుపులో ఉన్న శిశువు సైతం అనారోగ్యానికి గురవుతుందని ఉదాహరణగా చెప్పారు.
అదేవిధంగా చిన్న పిల్లలు తినేటప్పుడు చేతులు శుబ్రంగా కడుక్కోవడం వంటి విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలని చెప్పారు.
జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కరుణాకర్, డి.సి.పి.ఓ రాంబాబు, సి.డి.పి. ఒ లు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
