దూలపల్లి డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

దూలపల్లి డివిజన్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

కొంపల్లి సర్కిల్, దూలపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి సర్కిల్ దూలపల్లి డివిజన్‌లో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బైరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఆరోపించారు. అప్పట్లో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం అందించడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అదేవిధంగా నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం ద్వారా గత పదేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు.

నిరుపేదలకు ఉచిత బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారని, పేదల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు బైరి భాస్కర్ గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రాజు, మాజీ ఎంపీటీసీలు మోహన్ రావు, అశోక్, కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి ,నాగేశ్వరరావు, వెంకటేష్, గోవర్ధన్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.