అభివృద్దిలో అగ్రస్థానంలో సికింద్రాబాద్ ను నిలిపాం : పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో అగ్రస్థానంలో నిలుపుతున్నామని, అయితే ప్రభుత్వం తన ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. అశోక్ నగర్, లలిత నగర్, శకుంతల స్కూల్, ఈశ్వరి బాయి నగర్, అంబర్ నగర్ ప్రాంతాల్లో రూ.94.20 లక్షల ఖర్చుతో సి.సి. రోడ్డు నిర్మాణం పనులు, బౌద్ధనగర్ కనకదుర్గ టెంపుల్ వద్ద రూ.55 లక్షల ఖర్చుతో నాలా బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పలు సందర్భాల్లో ప్రజల ఇబ్బందులు నివారించడంలో తాము ముందు ఉంటామని అన్నారు. బౌద్ద నగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ. సహకారంతో బౌద్దనగర్ లో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు. వివిధ శాఖల అధికారులు సువర్ణ లత, మాధవి, వేణు, ప్రియాంక, కార్పొరేటర్ సామల హేమ,, సమన్వయకర్త రాజ సుందర్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. బౌద్దనగర్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించిన సందర్భంగా పలు ప్రజా సమస్యల పై పద్మారావు గౌడ్ స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
