మహనీయుల స్ఫూర్తి పథంలో పయనించండి
- ఇష్టపడి చదువుతూ ఉన్నతస్థానాలకు ఎదగండి
- లక్ష్య సాధనలో అడ్డంకులను ధైర్యంగా అధిగమించండి
- ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎందరో గొప్పవారయ్యారు
- కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్
అబ్దుల్ కలాం వంటి మహనీయుల స్ఫూర్తి పథంలో నడుచుకుంటూ విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
శనివారం కొండపల్లి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల 36వ వార్షికోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల మైదానంలో విద్యార్థినుల ప్రత్యేక పరేడ్ కార్యక్రమాన్ని తిలకించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ రక్షణ వ్యవస్థలో భారత్ ప్రపంచంలో సగర్వంగా నిలిచిందంటే అందుకు అబ్దుల్ కలాం వంటి మహనీయుల కృషే కారణమన్నారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కు తగ్గకూడదన్నారు. ఉపాధ్యాయులు చెప్పే మంచి మాటలను సరైన విధంగా అర్థం చేసుకుంటూ ముందడుగు వేయాలన్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రేరణ కారణంగానే ఈ స్థాయిలో నిలిచానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలుచేస్తోందని.. దీన్ని సద్వినియోగం చేసుకొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఎందరో గొప్పవారయ్యారు: శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే ఎందరో గొప్పవారయ్యారని.. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈస్థాయికి చేరుకున్నారన్నారు. ఇలాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కొండపల్లి బాలికల జెడ్పీ హైస్కూల్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో పాటు మైదానం అభివృద్ధికీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు కూడా అందిస్తామని వెల్లడించారు. చిన్నారులు విద్యతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాల్సిన అవసరముందని..
ఈ దిశగా విద్యాబోధన జరగాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడానికి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ చిన్నారులకు సూచించారు.
కార్యక్రమం సందర్భంగా విద్యార్థినుల మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థినులకు శాసనసభ్యులు సమకూర్చిన క్రీడాసామగ్రిని పరిశీలించారు.
కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ సీహెచ్ చిట్టిబాబు, ఎంపీపీ పి.జ్యోత్స్న, హెచ్ఎం హేమలత, స్థానిక పెద్దలు ఎ.రామమోహనరావు (గాంధీ), స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY