కేంద్ర పథకాలను వినియోగించుకోండి

Sakshitha news

కేంద్ర పథకాలను వినియోగించుకోండి

** తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
.
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మత్స్యకారుల సంక్షేమం, వారి ఆదాయ వృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన”… “జాతీయ మత్స్యకారుల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పిలుపునిచ్చారు. ఈ పథకాల ద్వారా మత్స్యకారులు, మత్స్య రంగంలో పనిచేసే సూక్ష్మ స్థాయి వ్యాపారులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు.
ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం ద్వారా మత్స్య రంగాన్ని ఆధునికీకరించి, సూక్ష్మ స్థాయి పరిశ్రమలకు గ్రాంట్లు, రుణ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చేపల పెంపకం లేదా సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ పథకానికి అర్హులని, దరఖాస్తు దారులు తప్పనిసరిగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకుని, ఆధార్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని తెలిపారు.


ఈ పథకానికి దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుందని, దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ అయిన https://nfdb.gov.in/ లేదా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఎన్ఎఫ్ డీపీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. అవసరమైన వివరాలు నమోదు చేసి, ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, యాక్టివిటీ ప్లాన్ వంటి పత్రాలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అప్లికేషన్ సమర్పించిన తర్వాత సిస్టమ్ ద్వారా ధృవీకరణ జరగగా, ఆమోదం వచ్చిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక సహాయం జమ అవుతుందని తెలియజేశారు. ఇక జాతీయ మత్స్యకారుల సంక్షేమ పథకం ద్వారా మత్స్యకారులకు గృహ నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ట్యూబ్ వెల్స్ ఏర్పాటు వంటి అవసరాలకు ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు.

ఈ పథకం ఆఫ్‌లైన్ విధానంలో అమలవుతుందన్నారు. అర్హులైన మత్స్యకారులు తమ సమీప ఫిష్‌కాపెడ్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కోసం అప్లికేషన్ ఫారం, ఫోటోలు, పడవ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నెట్ లైసెన్స్ రసీదు, నివాస ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి పత్రాలు అవసరమని ఆయన అన్నారు. ఈ రెండు పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని తమ ఆర్థిక స్థితిని మెరుగు పరచుకోవాలని ఎంపీ గురుమూర్తి సూచించారు.

Scroll to Top