తిరుమల భద్రత పై వక్రీకరణ తగదు

Sakshitha news

తిరుమల భద్రత పై వక్రీకరణ తగదు

** టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు టీడీపీ రాష్ట్ర నేత హితవు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుమల భద్రత నేపథ్యంలో కేంద్ర నిఘా విభాగం సూచనల మేరకు రాష్ట్ర పోలీసులు తిరుమలలోని మఠాలకు , ఇతర సంస్థలకు సూచనలు చేస్తే దానిని తప్పుపడుతూ వక్రీకరించి ప్రకటన చేయడం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తగదని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ హితవు పలికారు. తిరుపతిలోని జిల్లా టీడీపీ కార్యాలయం లో నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మఠాలపైన దాడులు అనే విధంగా “రాజకీయ విష ప్రచారం” చేయడం భూమన కరుణాకర్ రెడ్డికే చెల్లిందన్నారు. తిరుమలకు సంబంధించిన భద్రత విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సూచనల మేరకు తిరుమలలోని మఠాలకు, ఇతర సంస్థలకు ప్రతిరోజు వచ్చే లక్షలాది భక్తులకు సంబంధించి భద్రత గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు సూచించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు సూచనల మేరకు భద్రతలకు సంబంధించిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలను వక్రీకరిస్తూ పీఠాధిపతుల పైన దాడులు, మఠాలపైన దాడులు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చకొట్టే విధంగా రాజకీయ స్వార్థం కోసం విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, ఇకనైనా శ్రీవారిపై తిరుమల పై రాజకీయ లబ్దికోసం విష ప్రచారాలు మానండని నరసింహ యాదవ్ సూచించారు.

మీ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశాంతమైన నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పర్యటనలు సాగించి ఏ విధంగా ప్రజల్ని అసత్య ప్రచారాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పర్యటనలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇలాంటి రాజకీయాలు వైసీపీ చేస్తూ పోతే “మీ పార్టీని ప్రజలు, శ్రీవారి భక్తులు రాష్ట్రం విడిచి వెళ్లే విధంగా తరిమి కొడతారు” అని నరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో శ్రీవారి ప్రతిష్టను, తిరుమల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర అనేది శ్రీవారి భక్తులందరికీ తెలుసునన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ విధంగా తిరుమల ప్రతిష్టను దిగజార్చారో కూడా భక్తులందరికీ తెలుసన్నారు. లడ్డూలోని నెయ్యిని కల్తీ చేయడం, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో నిధులు దుర్వినియోగం, దర్శనాలను భారీగా అమ్ముకోవడం, అవసరం లేకున్నా కమిషన్లు కోసం సివిల్ కాంట్రాక్ట్ పనులు కోట్లాది రూపాయలు ఇచ్చి “శ్రీవారి ఖజానాను ఖాళీ చేసిన చరిత్ర” వైయస్ జగన్మోహన్ రెడ్డి ది అన్నారు.
అన్య మత ప్రచారాలను తిరుమలలో మీ పరిపాలనలో ఏ విధంగా సాగిందో శ్రీవారి భక్తుల అందరికీ తెలుసు… మీ పార్టీ గెలుపు కోసం నారా చంద్రబాబు నాయుడు పైన “పింక్ డైమండ్” తీసుకెళ్లారని అసత్య ప్రచారం చేసింది మీరు కాదా? మీకు శ్రీవారి ప్రతిష్ట తిరుమల పవిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.