ప్రధాని పర్యటనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది : ప్రత్తిపాటి
సాక్షిత : * కర్నూల్లో 16న జరిగే ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ విజయవంతంపై పత్తిపాడు కూటమి పార్టీల నేతలకు ప్రత్తిపాటి దిశానిర్దేశం.
- దేశంలో ఏ నాయకుడికి సాద్యంకాని అభివృద్ధి.. సంక్షేమాన్ని మన ముఖ్యమంత్రి ప్రజలకు అందిస్తున్నందుకు మూడుపార్టీల శ్రేణులు గర్వించాలి : ప్రత్తిపాటి.
- వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు వీడి, పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ, ప్రధాని రోడ్ షో, బహిరంగసభను దేశం గర్వించేలా జయప్రదం చేద్దాం: ప్రత్తిపాటి.
జీఎస్టీ ఉత్సవ్ లో భాగంగా కర్నూల్లో ఏర్పాటుచేసిన రోడ్ షో, బహిరంగసభకు స్వయంగా దేశ ప్రధాని మోదీ తరలిరానున్న నేపథ్యంలో కూటమిప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని మూడుపార్టీల నేతలు విజయవంతం చేయాలని మాజీమంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఆయన సోమవారం పత్తిపాడు శాసనసభ్యులు కే.ఈ.శ్యాంబాబు (శ్యాంకుమార్), ఇతర నాయకులతో కలిసి నియోజకవర్గ కూటమి శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సంక్షేమపథకాలపై విస్తృత ప్రచారం మనందరి బాధ్యత..
ఆర్థిక సమస్యలున్నా కూడా ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, మన నాయకుడు అమలుచేస్తున్న పథకాలపై విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీశక్తి, తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ, అన్నా క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అమలు, దీపం 2.0 పథకాలతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కిందని ప్రత్తిపాటి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు ఇటీవలే రూ.15వేల చొప్పున 2.96లక్షల మందికి రూ.440 కోట్ల వరకు చంద్రబాబు అందించారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా అమలు చేయనున్నారన్నారు.
కాస్త ఆలస్యమైనా సరే చంద్రబాబు, లోకేశ్ టీడీపీ శ్రేణులకు మంచి విందుభోజనం అందిస్తారు..
కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన ప్రతి ఒక్కరికీ మన నాయకులు తప్పక న్యాయంచేస్తారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు కాస్త ఆలస్యమైనా టీడీపీ శ్రేణులకు మంచి విందుభోజనం పెడతారుగానీ, పస్తులుంచరని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. మూడుపార్టీల శ్రేణులు ప్రజల సంతృప్తిని గమనించాలని, ఎప్పుడూ ప్రజల్లో ఉండేవారిని ఆయా పార్టీలు ఎప్పటికీ వదులుకోవని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో నాయకత్వాన్ని బలహీనపరిస్తే అంతిమంగా అందరం నష్టపోతామని, ఫలితంగా ప్రజలు.. రాష్ట్రం కూడా నష్టపోతాయన్నారు. మూడుపార్టీల శ్రేణులు ఓర్పుతో ఉండి ప్రధాని రోడ్ షో, బహిరంగసభను దేశం గర్వించేలా విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు.
సమావేశంలో పత్తికొండ శాసనసభ్యులు కే.ఈ.శ్యాంకుమార్ (శ్యాంబాబు), తాడేపల్లి గూడెం టీడీపీ ఇన్ ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, బీజేపీ, జనసేన కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
