రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Sakshitha news

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు….

తెలంగాణ ఆవిర్భావం త్యాగాల ఫలితం.. ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటూ సేవలందిస్తాం….

–సీపీ అంబర్ కిషోర్ ఝా….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాలు, అంకితభావం ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ రాష్ట్ర సాధన వెనుక ఉన్న మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు తదితర రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సామాజిక సామరస్యం, శాంతిభద్రతలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించి కష్టపడి పనిచేసినప్పుడే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు, అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు శాఖ గత మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. ఒకప్పుడు సమస్యాత్మక ప్రాంతాలుగా భావించిన అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడం పోలీసు శాఖ కృషికి నిదర్శనమన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పగలు, రాత్రి స్వేచ్ఛగా సంచరించే పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, అవినీతి, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకుండా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం 24 గంటలూ, వారంలో 7 రోజులు అందుబాటులో ఉంటూ సేవలందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన సేవా పతకాలను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏవో శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top