జర్నలిస్టుల సేవా కార్యక్రమం అభినందనీయం: సూర్యాపేట సిఐ వెంకటయ్య
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వం-ప్రజల మధ్య వారధులుగా పనిచేసే జర్నలిస్టులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమని సూర్యాపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీప ఫ్లైఓవర్ వద్ద తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టులు తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉన్నప్పటికీ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు రావడం శ్లాఘనీయమన్నారు. తీవ్ర వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగ పంపిణీ చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి, కమిటీ సభ్యులను సిఐ వెంకటయ్య అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, సంస్థ స్థాపన నుంచి గత ఐదు సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా సుమారు 300 మందికి పైగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమానికి సహకరించిన సభ్యులకు, ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ వెంకటయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దుస్సా చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్, ప్రోగ్రాం కన్వీనర్ వంశీకృష్ణ శర్మ, సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్, ఇతర నాయకులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.

