లాడ్జీలు, రెస్టారెంట్లు, వైన్ షాపులు, బస్టాండ్ పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు…..
గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక డ్రైవ్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరిఖని-1 టౌన్ పోలీసులు, పోలీస్ యాంటీ నార్కోటిక్స్ విభాగం, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సంయుక్త ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదావరిఖని బస్టాండ్, పాన్ షాపులు, ధూమపాన ప్రాంతాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లు, లాడ్జీలు, ఐబీ కాలనీ పరిసరాలు, ఆటో స్టాండ్లు, టీ స్టాళ్లు తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్కు వచ్చిన ప్రయాణికుల సామగ్రి, అనుమానాస్పద ప్రాంతాలు, అలాగే ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా గోదావరిఖని-1 టౌన్ ఎస్ఐ శ్రీ రమేష్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
