విద్యార్థులకు చట్టాలపై అవగాహన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీలత పర్యవేక్షణలో, సీఐ తమిళ్ అహ్మద్ ఆధ్వర్యంలో శక్తి టీం… ఈగిల్ టీం పోలీసులు కలిసి విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలపై జరిగే నేరాలు, బాలలపై లైంగిక దుర్వినియోగం (చైల్డ్ పోర్నోగ్రఫీ), బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, రోడ్డు భద్రత వంటి ముఖ్య అంశాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. అదేవిధంగా, విద్యార్థులు లక్ష్యసాధనతో చదువులు కొనసాగిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
అలాగే శక్తి టీం పోలీసులు ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు, తారకరామ స్టేడియం వద్ద ఫుట్ పట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై అనవసరంగా గుమిగూడుతున్న యువతను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. యువతలో క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని తెలియజేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల ప్రాముఖ్యత, భవిష్యత్ అవకాశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు.
తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు యువత భవిష్యత్ నిర్మాణానికి కూడా కట్టుబడి పనిచేస్తోందని ఈ కార్యక్రమాల ద్వారా తెలిపారు.

