పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: భీమారం, పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, అతనికి 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధించినట్లు భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ తెలిపారు.
ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో డయల్–100కు చొప్పరి పవన్ ఫోన్ చేసి, తాను ఇంట్లో లేని సమయంలో తన అన్న చొప్పరి శేఖర్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన భార్యతో గొడవపడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్ పోలీసు సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ భీమారం బోయవాడకు చెందిన చొప్పరి శేఖర్ పోలీసు సిబ్బందితో దుర్భాషలాడడమే కాకుండా వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించి, విధుల నిర్వహణకు ఆటంకం కలిగించాడు. పోలీసు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం చెన్నూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధించింది.
ఈ సందర్భంగా ఎస్ఐ ఎ. రాజేందర్ మాట్లాడుతూ, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

