రైల్వే గేట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు…..
ఎంపీ వంశీకృష్ణ చొరవతో వంతెనల నిర్మాణానికి స్థల పరిశీలన….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర కృషితో జిల్లాలో రైల్వే గేట్ల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగు పడింది. రైల్వే మార్గ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా పలు రైల్వే గేట్ల వద్ద వాహనాల రాకపోకలకు అనువుగా పైవంతెనల నిర్మాణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో ఓదెల మండలంలోని పలు గ్రామాలు, పెద్దంపేట ప్రాంతాల్లో ప్రతిపాదిత పైవంతెనల నిర్మాణానికి సంబంధించి అధికారులు సంయుక్త స్థల పరిశీలన నిర్వహించారు.
కాజీపేట – బల్లార్షా రైల్వే మార్గంలోని పొట్కాపల్లి, ఓదెల, కొలనూర్ గ్రామాలతో పాటు పెద్దంపేట పరిధిలో ఉన్న రైల్వే గేట్ల వద్ద అధికారుల బృందం స్థలాలను పరిశీలించింది. ప్రతిపాదిత మార్గాలపై గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, రైతులకు వివరాలు తెలియజేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు.
ఈ పరిశీలనలో రైల్వే, రెవెన్యూ, రహదారులు, పంచాయతీరాజ్, సాగునీరు, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచులు, రైతులు, పంచాయతీ కార్యదర్శులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రైల్వే గేట్ల వద్ద తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలను తగ్గించేందుకు పైవంతెనలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
