ట్రావెల్స్ బస్సుల ప్రత్యేక తనిఖీలు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం అర్ధరాత్రి…. వేకువజాము వరకు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ట్రావెల్స్ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఇతర రవాణా వాహనాలను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారులు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు, చెక్పోస్టుల వద్ద పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, అనుమానాస్పద వస్తువులు, ప్రయాణికుల వివరాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అనుమానం గా కనిపించిన వ్యక్తులను విచారించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించి నియమాలను పాటించాలని తిరుపతి జిల్లా పోలీసులు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY