లోకేశ్ విస్తృత ప్రచారమే ఎన్డీయే విజయంలో కీలక పాత్ర పోషించింది : ప్రత్తిపాటి
- బిహర్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ అడుపెట్టినప్పుడే ఎన్డీయే విజయపరంపర మొదలైంది.
- ఏపీని పెట్టుబడులకు గేట్ వేగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ లదే.
- జనవరి నాటికి 22 ఏ(1) సీ సమస్య పరిష్కించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.
- సుప్రీంకోర్టు నిర్ణయమైనందున మున్ముందు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సమస్య పరిష్కరించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు.
- 2019 ఎన్నికల్లో సమస్య పరిష్కరిస్తానన్న జగన్ చివరకు రైతుల్ని మోసగించాడు.
- ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించి, విలేకరులతో మాట్లాడిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయపరంపర కొనసాగుతుందని చెప్పడానికి బిహార్లో ఎన్డీయే కూటమి విజయమే నిదర్శనమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీని పెట్టుబడులకు గేట్ వే గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేళ్ లకే దక్కుతుందని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారవేదిక (గ్రీవెన్స్)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి… వాటి పరిష్కారంపై అధికార యంత్రాంగానికి సూచనలుచేసి, అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బిహార్ ఎన్నికల ఫలితాలు, విశాఖ సీఐఐ సమ్మిట్ నిర్వహణ, 22 ఏ (1) సీ సమస్య పరిష్కారం. 167 ఏ బైపాస్ అంశాలపై స్పందించారు.
ఏపీని పెట్టుబడులకు గేట్ వే గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకే దక్కుతుందని, విశాఖ సీఐఐ సదస్సు ప్రారంభానికి ముందే వారిద్దరి సమక్షంలో 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరగడం వారిపై పారిశ్రామికవేత్తలకు ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. సదస్సు జరిగే రెండు రోజుల్లో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుందన్న ఆయన, రెన్యూ పవర్ ఛైర్మన్ సుమంత్ సిన్హా వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు, లోకేశ్ లు పారిశ్రామికవేత్తల్ని ఒప్పించి, మెప్పించే విధానం అద్భుతంగా ఉంటుందన్న సిన్హా వ్యాఖ్యలతో ప్రపంచ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విశేష పాత్ర పోషించబోతోందని స్పష్టమవుతోందన్నారు. పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ల నాయకత్వమే నిదర్శనమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే పారిశ్రామికవేత్తల చూపు ఏపీవైపు మరలిందన్నారు. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి పనితీరుతో విశాఖ సదస్సు పలు కీలక ఒప్పందాలకు, లక్షలకోట్ల పెట్టుబడులకు కేంద్రగా మారడం యావత్ తెలుగుజాతికే గర్వకారణమని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభుత్వ వేగం చూస్తుంటే రాబోయే రెండేళ్లలోనే 20లక్షల ఉద్యోగాల హామీ నెరవేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
జనవరి నాటికి 22 ఏ(1) సీ సమస్య పరిష్కించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది
ప్రజలు ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య అయిన 22 ఏ(1) సీ పరిష్కారంపై గతంలో టీడీపీ ప్రభుత్వమే దృష్టిపెట్టిందని, 2014-19లో నాటి చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ ఆమోదముద్ర వేసి, బిల్లును రాష్ట్రపతికి పంపడం జరిగిందన్నారు. తర్వాత ప్రభుత్వం మారడం.. ఎన్నికల సమయంలో సమస్య పరిష్కరిస్తానని చెప్పిన జగన్.. అధికారంలోకి రాగానే తన పబ్బం గడుపుకొని, ప్రజల్ని మోసగించారని ప్రత్తిపాటి చెప్పారు. 22 ఏ(1) సీ సమస్య అనేది ఏ వ్యక్తో, ప్రభుత్వమో సృష్టించింది కాదని, కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం వల్ల ఉత్పన్నమైందన్నారు. కూటమిప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై కేబినెట్ సబ్ కమిటీ వేసిందన్నారు. జనవరి నాటికి సమస్య పరిష్కారం చేయాలనే గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నారని ప్రభుత్వం ఆదిశగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది 22ఏ(1) సీ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారని, అలానే పట్టణంలో సగం మంది బాధపడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. సుప్రీంకోర్టు నిర్ణయమైనందున భవిష్యత్ లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు ప్రత్తిపాటి తెలిపారు.
167 ఏ బైపాస్ కు భూములిచ్చిన రైతులకు గత అవినీతి మంత్రి అన్యాయం చేశారు
నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రి అనాలోచిత నిర్ణయాల వల్ల 167 ఏ బైపాస్ కు భూములిచ్చిన రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పటికీ చాలామంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందలేదని ప్రత్తిపాటి తెలిపారు. తక్కువ ధర నిర్ణయించిన రైతులు న్యాయం కోసం ఆర్బిట్రేషన్ ను సంప్రదిస్తున్నారన్నారు. తాముకూడా వారికి అదే చెబుతున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయన్నారు. నేడు గ్రీవెన్స్ లో ఈ సమస్యపై రైతులు తనను సంప్రదించారని, వారికి న్యాయం చేసే ఆలోచనలో ఉన్నామని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని,
జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులుశివనాగేశ్వరరావు,
పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, ప్రధాన కార్యదర్శి మద్దుమలా రవి, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
