అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
** శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అర్చకులు, అధికారులు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
10 పరదాలు అమ్మవారికి బహుకరణ:
హైదరాబాద్ కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను, తిరుపతికి చెందిన మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామికి దాతలు అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆలయ డెప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
