శ్రీ సరస్వతి దేవి అలంకృత దుర్గామాతను దర్శించుకోవడం సంతోషకరం
— కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
సాక్షిత : ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైవున్న దుర్గామాతను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం శుభ ఘడియల్లో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేష వస్త్రాన్ని స్వీకరించారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో యంత్రాంగం చాలా చక్కని ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోందని పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీకే శివకుమార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
