ఎన్నికల బందోబస్తు పర్యవేక్షణ, పోలింగ్ ప్రక్రియపై ఆరా…
మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్….
సాక్షిత పెద్దపల్లి .రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్టీపీసీ లోనీ ప్రభుత్వ హైస్కూల్,టీటీఎస్, మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వీ, క్రిస్ట్ స్కూల్ తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, భద్రతాచర్యలు, క్యూలైన్ల నిర్వహణ, వృద్ధులు, దివ్యాంగుల కోసం కల్పించిన ప్రత్యేక సదుపాయాలను కమిషనర్ పరిశీలించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా కొనసాగుతోందా అనే అంశంపై కమిషనర్ ప్రత్యక్షంగా ఆరా తీసి, పోలింగ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. అలాగే ఓటర్లతో కూడా మాట్లాడి,ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల శాంతి భద్రతల కోసం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు,ఓటర్లు భయభ్రాంతులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్,మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు,ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

