నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ
పొలాల్లో పగలగొట్టి నగదు, బంగారం–వెండి ఆభరణాలు దోపిడీ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ గ్రామ శివారులోని దండు మైసమ్మ తల్లి ఆలయంలో అర్ధరాత్రి దుండగులు హుండీని పగలగొట్టి భారీగా నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఆలయంలో భక్తులు భక్తితో సమర్పించిన కానుకలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న పొలాల్లో హుండీని పగలగొట్టి అందులోని నగదు, బంగారు–వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి సీఐ రాజశేఖర్, ఎస్సై శ్రీకాంత్ చేరుకుని పరిశీలన చేపట్టారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఇటువంటి ఘటన జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయాల్లో భద్రతా చర్యలు మరింత కఠినంగా చేపట్టాలని కోరుతున్నారు.

