ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల న్యాయపోరాటానికి అఖండ సంఘీభావం…..
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకత్వం సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, కోశాధికారి ఇనుగాల రాజేశ్వర్ మాట్లాడుతూ కార్మికుల శ్రమను యాజమాన్యం దోపిడీ చేస్తోందని విమర్శించారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రి సౌకర్యం, ఉద్యోగుల భవిష్య నిధి–ఉద్యోగుల బీమా సహాయ కేంద్రం ఏర్పాటు, కార్మికుల పిల్లలకు విద్యలో ప్రాధాన్యత, భద్రతా పరికరాల కల్పన, తాగునీటి సౌకర్యం, బోనస్లు, గ్యాస్ భత్యం పెంపు వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. వేధింపుల పేరుతో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పడిన ఆర్ఎఫ్సీఎల్ సంస్థలో కార్మిక హక్కులను కాలరాస్తూ స్థానిక కార్మికులను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల కార్మికులతో పనులు చేయిస్తూ సమ్మెను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాయకులు ఆరోపించారు. ఈ ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ నిరసన కార్యక్రమంలో తోకల రమేష్, ఈసంపల్లి రాజేందర్, ఇనుగాల రాజేశ్వర్, నెల్లికంటి రాము, కన్నూరి భాగ్యలక్ష్మి శంకర్, బెంద్రం రాజిరెడ్డి, చుక్కల శ్రీనివాస్, ఎలుకలపల్లి మాజీ ఉపసర్పంచ్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
