ప్రజావాణి అర్జీలను పెండింగ్లో ఉంచొద్దు.. సత్వరమే పరిష్కరించాలి: డీఆర్వో రాజేశ్వరి
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖలకు వెంటనే పంపిస్తూ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన ఎ. లక్ష్మి తమ గ్రామంలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టును తమకు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేయగా, సంబంధిత వారధి సొసైటీ అధికారులకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన మహంకాళి వీరమ్మ, గొట్టె లింగమ్మ సర్వే నంబర్ 294లో ప్రభుత్వం తరఫున ఉమ్మడి బోర్వెల్ ఏర్పాటు చేయాలని కోరగా, సంబంధిత శాఖ అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంథని పట్టణం రాఘవ ఊర్ల నగర్కు చెందిన భీమనపల్లి సురేందర్ తన కుమార్తెకు బీసీ గురుకుల పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, గురుకుల విద్యాసంస్థల సొసైటీ అధికారులకు దరఖాస్తును పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ డి విభాగ పర్యవేక్షకులు ఈశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

