ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయ మైదానంలో హుషారుగా సాగిన క్రికెట్ టోర్నమెంట్
సాక్షిత వనపర్తి :
క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని, యువత క్రీడలను అలవాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో పోలీసు, రెవెన్యూ, ప్రెస్ మీడియా, ఉపాధ్యాయుల జట్లు పాల్గొన్నాయి.
హుషారుగా సాగిన ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా, ఉపాధ్యాయుల జట్టు రన్నరప్గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు . అదనపు ఎస్పీ రాజేష్ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మ్యాచ్ను వీక్షించి క్రీడాకారులను అభినందించారు.
టోర్నమెంట్ విజేతలు మరియు రన్నరప్ జట్లకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఎల్ ఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తాయని, యువత క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు.
వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడల ద్వారానే సాధ్యమని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
డిఐజి ఎల్ ఎస్ చౌహన్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలిపారు.
ఏ ఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, రెవెన్యూ, పోలీస్, ప్రెస్ మీడియా, విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

