ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు…
ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించాలి…
– తాండ్ర సదానందం…
సాక్షిత పెద్దపల్లి ; . గోదావరిఖని ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ పార్టీ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, నగర కార్యదర్శి కామ్రేడ్ కె. కనకరాజ్తో కలిసి కార్మికులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా తాండ్ర సదానందం మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే 40 రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 32 డిమాండ్లపై కార్మికులు సమ్మె చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు అబ్దుల్ కరీం, కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, టి. రమేశ్ కుమార్, ప్రజానాట్య మండలి నాయకుడు ఎజ్జా రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

