ఎన్టీపీసీ రామగుండం సీఎస్ఆర్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసిన యువతకు ధ్రువపత్రాలు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, ఎన్టీపీసీ రామగుండం కార్పొరేట్ సామాజిక బాధ్యత ( సి ఎస్ ఆర్ ) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెండు నెలల సర్టిఫైడ్ కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. సాయి సేవా సమితి సమీపంలోని వృత్తి శిక్షణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి “దీప్తి మహిళా సమితి”అధ్యక్షురాలు రాఖీ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీప్తి మహిళా సమితి సభ్యులు, అధ్యాపకులు, సీఎస్ఆర్ ప్రతినిధులు, శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక యువతలో డిజిటల్ అవగాహన పెంపొందించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఎన్టీపీసీ రామగుండం సీఎస్ఆర్ విభాగం, దీప్తి మహిళా సమితి సంయుక్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (DCA), డిప్లొమా ఇన్ కంప్యూటరైజ్డ్ ట్యాలీ విత్ జి ఎస్ టి కోర్సుల్లో శిక్షణ అందించి, ఉద్యోగ రంగానికి అవసరమైన ప్రాయోగిక నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించారు.
ఈ సందర్భంగా రాఖీ సమంత మాట్లాడుతూ, శిక్షణలో పాల్గొన్న యువత చూపిన కృషిని అభినందించారు. ఈ శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడాలని సూచించారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వ ఉపాధి శాఖ నుంచి ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమాజ అభివృద్ధి, నైపుణ్య వికాసం, యువత సాధికారతకు ఎన్టీపీసీ రామగుండం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
