దళితోద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ….
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు…
–అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: సమాజంలో సమానత్వం, దళితోద్ధరణ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం విశేష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ సేవలు చిరస్మరణీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ అన్నారు.
ఐడీఓసీ పెద్దపల్లిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ, విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని విశ్వసించిన భాగ్యరెడ్డి వర్మ తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. దళితుల సాధికారత, సామాజిక చైతన్యం, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
మహానీయుల ఆశయాలను గుర్తుచేసుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహిస్తోందని తెలిపారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మహనీయుల బాటలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

