ఏఐటియుసిపై అబద్ధపు ప్రచారాలు మానుకోండి…
–గుమ్మడి కుమారస్వామి వ్యాఖ్యలను ఖండించిన సిపిఐ నాయకులు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, ఎర్రజెండా ఏఐటియుసిపై అబద్ధపు ప్రచారాలు కొనసాగిస్తే సహించబోమని సిపిఐ నగర కార్యదర్శి కే. కనకరాజ్ హెచ్చరించారు. గుమ్మడి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని సిపిఐ నగర సమితి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిపిఐ, ఏఐటియుసి సంస్థలు దళితులకు సముచిత స్థానం కల్పించకుండా అవమాన పరుస్తున్నాయన్న ఆరోపణలు అసత్యమని అన్నారు. ఏఐటియుసి మాజీ అధ్యక్షుడు వై. గట్టయ్య, మద్దెల దినేష్లను బయటకు పంపించారని చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఎవరో రాసిన పాటను ఏఐటియుసికి ఆపాదిస్తూ అబద్ధపు ప్రచారాలు చేయడం తగదని, ఆ అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సిపిఐ, ఏఐటియుసి సంస్థలదేనని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్ళపెల్లి మల్లయ్య, ఎం.ఏ. గౌస్, తొడుపునూరి రమేశ్ కుమార్, ఉప్పులేటి తిరుపతి, గొడిశల నరేశ్, నంది నరేశ్, రేణుకుంట్ల ప్రీతం, ఆసాల నవీన్, పడాల కనకరాజు, రాజయ్య, పుల్లూరి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

