సింగరేణి స్కూల్ పిల్లలకు బస్ సౌకర్యం ఎత్తివేతపై ఆగ్రహం…
యాజమాన్యం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలి…
–ఏఐటీయూసీ నేత రంగు శ్రీను హెచ్చరిక…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, సింగరేణి స్కూల్లో చదువుతున్న కార్మికుల పిల్లలకు బస్ సౌకర్యాన్ని ఎత్తివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో బస్ సౌకర్యాన్ని ఎత్తివేయడం సరైన విధానం కాదని విమర్శించారు.
యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్కు రావడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని రంగు శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుండి వచ్చే పిల్లల చదువుపై దీని ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు.
కావున యాజమాన్యం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, స్కూల్ పిల్లలకు బస్ సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్కూల్ పిల్లల తల్లిదండ్రులతో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
