పోగొట్టుకున్న మొబైళ్ల రికవరీలో సూర్యాపేట పోలీసుల సత్తా
బాధితులకు 11వ విడత పంపిణీ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ మరోసారి ప్రజాభిమానాన్ని చూరగొంది. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సెల్ఫోన్ రికవరీ మేళాలో సుమారు రూ.20 లక్షల విలువైన 106 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ చేతుల మీదుగా 11వ విడతగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లు నేటి కాలంలో కమ్యూనికేషన్తో పాటు ఆర్థిక లావాదేవీలకు కీలకమైందని, వాటి పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం, డబ్బు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెంటనే CEIR పోర్టల్లో నమోదు చేసి బ్లాక్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీసుల కృషితో తమ మొబైల్లు తిరిగి పొందిన బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
