పేదింటి ఆడబిడ్డలకు వరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
194 మంది లబ్ధిదారులకు ఒక కోటి 94 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ
పటాన్చెరు
పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్, రామచంద్రపురం, గుమ్మడిదల, జిన్నారం, పటాన్చెరు రెవెన్యూ మండలాల పరిధిలోని 194 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన ఒక కోటి 94 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మీ కొండంత ఆసరగా నిలుస్తోందని తెలిపారు.

