గ్రామ పంచాయతీ మూడవ విడత ఎన్నికలకు నేటి సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచారం పరిసమాప్తం
సైలెన్స్ పీరియడ్ లో ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి వీలు లేదు
నిబంధనలు అతిక్రమించే వారిని గుర్తించి కేసులు బుక్ చేయండి
మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండ పకడ్బందీగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలి – జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
సాక్షిత వనపర్తి
డిసెంబర్ 17న వనపర్తి జిల్లాలోని 5 మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సాయంత్రం 5 గంటలతో ప్రచారం పరిసమాప్తం అయినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ప్రకటించారు.
సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించనున్న అయిదు మండలాల ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు.
మోడల్ కోడ్ అనేది ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఉంటుందని ఏ ఒక్కరు ఇంటింటి ప్రచారం లేదా మీడియా లో ప్రచారం చేయడానికి వీలు లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు చేయకుండా రిటర్నింగ్ అధికారులు నిబంధనలు ఒకటికి రెండుసార్లు చదువుకొని అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లక్ష్యం చేసిన, తప్పులు చేసిన చర్యలు కటినంగా ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ నుండి ఎన్నికల ప్రారంభం, పోలింగ్ నిర్వహణ అనంతరం కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే వరకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు చేయాల్సిన విధులు, బాధ్యతల పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు.
మూడవ విడత ఎన్నికలు జరిగే పెబ్బేరు, శ్రీరంగాపూర్, చిన్నంబావి, పానగల్, వీపనగండ్ల మండలాల్లో 87 గ్రామ పంచాయతీలు, 806 వార్డులకు గాను ఇప్పటికే చిన్నంబావి మండలంలో ఒక గ్రామ పంచాయతీ గడ్డబస్వాపూర్, పానగల్ మండలంలో దేవాజిపల్లి, బహదూర్ గూడెం, పెబ్బేర్ మండలంలో పెంచికల్ పాడు, రామమ్మపేట, రాంపూర్ (6) గ్రామాల సర్పంచులు, 104 వార్డు మెంబర్లు ఏకగ్రీవం కాగా మిగిలిన 81 సర్పంచి, 702 వార్డు మెంబర్లకు డిసెంబర్ 17న ఎన్నికలు జరుగనున్నాయి.
ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిపిఒ రఘుపతి రెడ్డి, తరుణ్ చక్రవర్తి, సి.పి. ఒ హరికృష్ణ, ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.