తిరుపతిలో ఘంటసాల జయంతి వేడుక
** గానగంధర్వుని విగ్రహానికి పుష్పాభిషేకం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు.
ప్రఖ్యాత గాయక బ్రహ్మ ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక వివి మహల్ రోడ్ చివరిలో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు పుష్పాభిషేకం చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కళాకారులు కస్ప పద్మనాభంకు ఘంటసాల మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కేఎన్ రాజా, గుండాల గోపీనాథ్ రెడ్డి, సురేష్ స్వామి, ఆదిస్వామి, పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందం, సాంబోలా హరినాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, కస్ప పద్మనాభం, పూల జనార్దన్ రెడ్డి, బాబు, కొట్టే సుబ్రహ్మణ్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

