12 రాష్ట్రాల్లో మహిళా పథకాలు.. రూ.1.68 లక్షల కోట్ల భారం

Sakshitha news

12 రాష్ట్రాల్లో మహిళా పథకాలు.. రూ.1.68 లక్షల కోట్ల భారం

మహిళల కోసం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

మూడేళ్లలోనే 2 రాష్ట్రాల నుంచి 12 రాష్ట్రాలకు విస్తరించిన పథకాలు

ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకాల కోసం రూ.1.68 లక్షల కోట్ల కేటాయింపు

ఈ పథకాలు అమలు చేస్తున్న 6 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు నమోదు

ఆదాయ మిగులు రాష్ట్రాలు సైతం లోటులోకి వెళ్తున్నాయని అధ్యయనంలో వెల్లడి

పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ నివేదికలో కీలక అంశాల ప్రస్తావన

మహిళలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలు (యూసీటీ) వాటి ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ పథకాల వల్ల మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాలు సైతం రెవెన్యూ లోటులోకి జారిపోతున్నాయని ‘పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌’ అనే సంస్థ తన నివేదికలో హెచ్చరించింది.

కేవలం మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాలకే పరిమితమైన ఇలాంటి పథకాలు, ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు విస్తరించాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ 12 రాష్ట్రాలు తమ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పథకాల అమలు కోసం ఏకంగా రూ.1.68 లక్షల కోట్లు (1.68 ట్రిలియన్లు) వెచ్చిస్తున్నాయని తెలిపింది. ఇది రాష్ట్రాల ఖజానాపై మోయలేని భారంగా మారుతోందని విశ్లేషించింది.

ఈ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాలు ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును నమోదు చేశాయని పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. నగదు బదిలీ పథకాల విస్తృతి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్‌గా మారిందనడానికి ఇదే బలమైన నిదర్శనమని వ్యాఖ్యానించింది. సంక్షేమం పేరుతో అమలు చేస్తున్న ఈ ఉచిత నగదు బదిలీ పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటోందని, భవిష్యత్తులో ఇది మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Scroll to Top