కుత్బుల్లాపూర్‌ నుంచి ఢిల్లీకి సోను యాదవ్‌ సైకిల్ యాత్ర జెండా ఊపి ప్రారంభించిన కూన శ్రీశైలం గౌడ్‌

Sakshitha news

కుత్బుల్లాపూర్‌ నుంచి ఢిల్లీకి సోను యాదవ్‌ సైకిల్ యాత్ర జెండా ఊపి ప్రారంభించిన స్థానిక మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్‌

కుత్బుల్లాపూర్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సోను యాదవ్‌ చేపట్టిన సాహసోపేత సైకిల్‌ యాత్ర కుత్బుల్లాపూర్‌ నుంచి ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్‌ నుంచి ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు సుమారు మూడు నెలల పాటు కొనసాగనున్న ఈ యాత్రను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్‌ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ భవిష్యత్తుపై తన రాజకీయ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఇంత సుదీర్ఘమైన సైకిల్‌ యాత్రకు శ్రీకారం చుట్టిన సోను యాదవ్‌ను అభినందించారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా పట్టుదలతో యాత్రను కొనసాగిస్తున్న ఆయన సంకల్పం అభినందనీయమని అన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడాలని, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనే సోను యాదవ్‌ ఆకాంక్ష నెరవేరాలని కూన శ్రీశైలం గౌడ్‌ గారు ఆకాంక్షించారు. ప్రజల సమస్యలు, దేశ రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగే ఇలాంటి ప్రజా యాత్రలు ప్రజాస్వామ్య చైతన్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

సైకిల్‌ యాత్ర నిర్వాహకులు సోను యాదవ్‌ మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్‌ నుంచి ప్రారంభమైన తన యాత్ర తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా కొనసాగి చివరకు ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ముగుస్తుందని తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు వేలాది కిలోమీటర్ల మేర సైకిల్‌పై ప్రయాణిస్తూ ప్రజలను కలుసుకుని తన ఆకాంక్షను తెలియజేస్తానని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే తన సంకల్పాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని వివరించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్‌–మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్‌ గౌడ్‌ మరియు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని సోను యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సైకిల్‌ యాత్ర విజయవంతంగా పూర్తిచేసి ఢిల్లీకి చేరుకోవాలని నాయకులు ఆకాంక్షిస్తూ ఆయనకు తమ మద్దతు ప్రకటించారు.

Scroll to Top