ఓదెల మల్లన్న ఆలయానికి మాస్టర్ ప్లాన్, అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు…
సాక్షిత : ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయ పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…
ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లిఖార్జున స్వామి ఆలయ అభివృద్ధికి, భారీ స్థాయిలో నిధులు మంజూరయ్యాయి అని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు తెలిపారు.
ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు కేటాయించగా, ఆలయ ప్రత్యేక నిధుల నుండి మరో రూ.5 కోట్లను వినియోగిస్తూ మొత్తం రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ మేరకు ఓదెల శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ను హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం “ధార్మిక భవన్”లో సంబంధిత అధికారులు, స్థపతి వల్లినయాగన్ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు కి వివరించారు.
ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే దిశగా మాస్టర్ ప్లాన్ రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు, ఓదెల ఆలయ చైర్మన్, డైరెక్టర్లు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
