బీజేపీ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులా..?
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్పై జరుగుతున్న ప్రచారంపై కార్యకర్తల ఆందోళన….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.
బండి సంజయ్పై అవమానకర పోస్టర్లు, ధర్మపురి అర్వింద్పై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, ఈటల రాజేందర్ను కించపరిచే ఫ్లెక్సీలు వెలువడటం వెనుక బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న సామాజిక మాధ్యమ వర్గాల పాత్ర ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన అంశాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉందని పేర్కొంటున్నారు.
ఈ ముగ్గురు నాయకుల పెరుగుతున్న ప్రజాదరణను చూసి వారిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని కార్యకర్తలు అంటున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన నాయకత్వంతో ముందుకు సాగుతోందని, ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతోందని వారు పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని, వాస్తవాలను గుర్తించి కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు.
