సూర్యాపేటలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ప్రారంభం
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి: వికాస్ ఫార్మసీ కాలేజీలో జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
శిక్షణా కార్యక్రమాల ద్వారా సిద్ధాంతపరమైన అవగాహనతో పాటు సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు, అంత్యోదయ సిద్ధాంతం, ప్రజాసేవలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

