చదువుతో పాటు కులవృత్తికి గౌరవం.. తాటి, ఈత చెట్లు గీస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువ గౌడ్ హేమసుందర్…..
తాతల వారసత్వాన్ని కొనసాగిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన బ్రాహ్మణపల్లి విద్యార్థి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లాప్రతినిధి: ఆధునిక విద్యను అభ్యసిస్తూ కూడా పూర్వీకుల నుంచి వచ్చిన కులవృత్తిని గౌరవంగా కొనసాగిస్తూ అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువ గౌడ్ మడ్డి హేమసుందర్ గౌడ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కేవలం 15 ఏళ్ల వయస్సులోనే తాటి, ఈత చెట్లు ఎక్కి కల్లు గీయడం నేర్చుకుని కుటుంబ వారసత్వ వృత్తిని కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం రామగుండం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న హేమసుందర్ గౌడ్, గత ఏడాది కాలంగా తన పెద్దబాపు మడ్డి భాస్కర్ గౌడ్ వద్ద శిక్షణ పొంది ఈత, తాటి చెట్లు గీయడంలో నైపుణ్యం సాధించాడు. ఈ వృత్తిని నేర్పిన తన పెద్దబాపును ఎప్పటికీ మరచిపోనని తెలిపాడు.
ఈ సందర్భంగా హేమసుందర్ గౌడ్ మాట్లాడుతూ, విద్యాభ్యాసం చేసి ఉన్నత ఉద్యోగాలు సాధించినా తమ తాతలు, ముత్తాతల నుంచి వచ్చిన కులవృత్తిని మరవకూడదని అన్నారు. ప్రతి యువకుడు తన సంప్రదాయ వృత్తిని తెలుసుకుని, కుటుంబ వారసత్వాన్ని కాపాడాలని సూచించారు.
మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబానికి అండగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు. పెద్దల అనుభవాన్ని గౌరవిస్తూ వారి మార్గదర్శకత్వంలో సంప్రదాయ వృత్తులను నేర్చుకోవడం ద్వారా సంస్కృతి, వారసత్వం నిలబెట్టవచ్చని పేర్కొన్నారు.
కులవృత్తి పట్ల హేమసుందర్ చూపుతున్న ఆసక్తి, అంకితభావం గ్రామస్థులు, గౌడ సంఘ నాయకుల ప్రశంసలు అందుకుంటోంది.

