బక్రీద్ నేపథ్యంలో అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీలు ..

Sakshitha news

బక్రీద్ నేపథ్యంలో అర్ధరాత్రి చెక్‌పోస్ట్ తనిఖీలు ..

అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశం…

బసంత్‌నగర్ టోల్‌గేట్ చెక్‌పోస్ట్‌ను అర్ధరాత్రి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్…….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి బసంత్‌నగర్ టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడిన కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గుర్తించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు.

పండుగ సమయంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకునేలా పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద అంశాలపై వెంటనే సమాచారం అందించాలని కోరారు.

బక్రీద్ వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా కమిషనరేట్ పరిధిలో విస్తృత భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Scroll to Top